లక్ కోసం.. అహ్మదాబాద్‌లో టీమిండియా హోటల్ మార్పు

  • నరేంద్ర మోదీ స్టేడియంలో గతంలో రెండు కీలక మ్యాచ్‌లు ఓడిపోయిన ఇండియా
  • దీంతో ఫైనల్ కోసం జట్టు బస చేసే హోటల్‌ను మార్చిన బీసీసీఐ
  • డ్రెస్సింగ్ రూమ్ కూడా మార్చాలని నిర్ణయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా బస చేసే హోటల్‌తో పాటు డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా మార్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.


గతంలో అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో బస చేసినప్పుడు టీమ్ ఇండియా రెండు కీలక మ్యాచ్‌లలో ఓడిపోయింది. దీంతో ఈసారి ఫైనల్ కోసం జట్టు బస చేసే హోటల్ ను బీసీసీఐ మార్చేసింది. గతంలో ఉన్న హోటల్‌కు బదులుగా ఈసారి టీమ్ ఇండియా తాజ్ స్కైలైన్ (Taj Skyline) హోటల్‌లో బస చేస్తోంది. అంతేకాదు, సాధారణంగా హోమ్ టీమ్‌కు కేటాయించే డ్రెస్సింగ్ రూమ్‌ను కాకుండా, ఈసారి విజిటింగ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌ను వాడాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.


ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. 'దండియా క్వీన్' ఫాల్గుణి పాఠక్, సింగర్స్ సుఖ్బీర్, సుఖ్వీందర్ సింగ్ తమ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు.


మరోవైపు, ముంబై నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలు పెరగడంతో, వెస్ట్రన్ రైల్వే రెండు ప్రత్యేక ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లను అహ్మదాబాద్ కు నడుపుతోంది.



More Telugu News