త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత

  • భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత
  • వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్న కవిత దంపతులు
  • నాలుగేళ్లుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిందన్న కవిత
త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత నిన్న రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి తిరుపతి చేరుకున్నారు. ఆ తర్వాత అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.


More Telugu News