Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి తిరుపతి కోర్టుకు వచ్చిన దివ్వెల మాధురి
- తిరుమల కొండపై రీల్స్ చేసిన కేసులో నిన్న కోర్టుకు హాజరైన మాధురి
- నిన్ననే మరో వివాదంలో చిక్కుకున్న దివ్వెల మాధురి
- నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో బర్త్ డే కేక్ కట్ చేసిన వైనం
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన దివ్వెల మాధురి, మరోసారి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల కొండపై నిన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేయడంతో ఆమెపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలోని ఆలయ పరిసరాల్లో మాధురి ఈ వేడుకను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం తిరుమల కొండపై కేక్ కటింగ్ వంటి వేడుకలకు అనుమతి లేనప్పటికీ, ఆమె స్వయంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ తనూజతో కేక్ కట్ చేయించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి చర్యలేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో తిరుమలలో రీల్స్ చేసిన కేసులో మాధురి గురువారం తిరుపతిలోని రెండవ అదనపు మున్సిఫ్ కోర్టులో హాజరయ్యారు. ఆమె వెంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకు వచ్చారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి కోటేశ్వరరావు, వచ్చే మే 12వ తేదీన ఇద్దరు జామీనుదారులతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. ఒకవైపు కోర్టులో ఒక అంశంపై విచారణ జరుగుతుండగానే, మరోవైపు మళ్ళీ నిబంధనలను అతిక్రమించి మరో వివాదానికి తెరలేపడంతో ఈ వ్యవహారం టీటీడీ అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది.