శ్రీవారి చెంత ‘దేవర’ బ్యూటీ.. వీడియో ఇదిగో!

  • 29వ పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్ సందడి
  • కాలినడకన కొండపైకి చేరుకున్న నటి
  • ఏటా పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారి దర్శనం
బాలీవుడ్ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన పుట్టినరోజు (మార్చి 6) సందర్భంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏటా తన పుట్టినరోజున తిరుమలకు రావడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ, ఈ ఏడాది కూడా తన మొక్కును తీర్చుకున్నారు. గురువారం రాత్రి జాన్వీ కపూర్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తెల్లటి కుర్తా ధరించి, చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని 3,500 మెట్లను ఆమె ఎక్కారు. ఆమె వెంట సీనియర్ నటి మహేశ్వరితో పాటు భద్రతా సిబ్బంది ఉన్నారు. మెట్లు ఎక్కుతున్న సమయంలో జాన్వీకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుట్టినరోజున వీఐపీ బ్రేక్ దర్శనం

మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్న జాన్వీ.. గురువారం రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిపై అచంచల భక్తి

జాన్వీ కపూర్‌కు తిరుమల శ్రీవారంటే ఎంతో భక్తి. తన తల్లి శ్రీదేవి పుట్టినరోజున కూడా ఆమె తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ఏదైనా కొత్త సినిమా ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు, ఆ సినిమా స్క్రిప్ట్‌ను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జాన్వీకి అలవాటు. స్వామివారి ఆశీస్సులు ఉంటేనే తనకు విజయం లభిస్తుందని ఆమె బలంగా నమ్ముతారు.

గత ఏడాది కూడా..

గతంలో తన 27వ పుట్టినరోజున కూడా జాన్వీ తన స్నేహితుడు శిఖర్ పహారియా, ఓరీతో కలిసి తిరుమలకు వచ్చారు. అప్పుడు ఆమె సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వామివారిని దర్శించుకుని తన భక్తిని చాటుకున్నారు.



More Telugu News