ధోనీకి ఓవర్ స్పీడ్ ఫైన్... రాంచీలో ట్రాఫిక్ చలాన్

  • రాంచీలో ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకు ధోనీకి జరిమానా
  • ఆటోమేటెడ్ సిస్టమ్ గుర్తించడంతో రూ.1000 ఈ-చలాన్ జారీ
  • మోటారు వాహన చట్టం సెక్షన్ 183 కింద కేసు నమోదు
  • ఇటీవలే నివాస స్థలం దుర్వినియోగంపై కూడా నోటీసులు
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. రాంచీలో పరిమితికి మించి వేగంగా వాహనం నడిపినందుకు ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. తన ఇంటి సమీపంలో ధోనీ వాహనం వేగంగా వెళ్లడాన్ని నగరంలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద అధికారులు ఆయనకు ఈ-చలాన్ జారీ చేశారు.

ఈ ఉల్లంఘన చిన్నదే అయినప్పటికీ, ధోనీకి సంబంధించిన విషయం కావడంతో సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రాంచీలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ-చలాన్ జారీ అయినట్లు తెలుస్తోంది.

కాగా, కొద్ది రోజుల క్రితమే ధోనీ మరో న్యాయపరమైన సమస్యను ఎదుర్కొన్నాడు. నివాసం కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాంచీలోని హర్ము రోడ్డులో ఉన్న ఈ ప్లాట్‌లో ధోనీ గతంలో నివసించాడు. ప్రస్తుతం ఆయన రింగ్ రోడ్డులోని తన కొత్త నివాసంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు ఘటనలతో ధోనీ వార్తల్లో నిలిచాడు.


More Telugu News