Chandragrahanam: ముగిసిన అరుదైన చంద్రగ్రహణం... తిరిగి తెరుచుకున్న శ్రీవారి ఆలయం

Chandragrahanam Ends SreeVari Temple Reopens
  • ఆకాశంలో కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం
  • రక్త వర్ణంలో దర్శనమిచ్చిన చందమామ
  • భారత్‌లో చంద్రోదయం తర్వాత కనిపించిన గ్రహణం
  • గ్రహణం సందర్భంగా పలు ఆలయాల మూసివేత
  • చంద్రగ్రహణం కారణంగా మూతపడిన తిరుమల ఆలయం
  • ఆలయ శుద్ధి అనంతరం దర్శనాలు పునఃప్రారంభం
ఆకాశంలో ఓ అద్భుత ఖగోళ దృశ్యం కనువిందు చేసింది. ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను అలరించింది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో, జాబిల్లి పూర్తి ఎర్ర రంగులోకి మారి 'బ్లడ్ మూన్' (రక్త చంద్రుడు)గా దర్శనమిచ్చింది. భారత్‌లోనూ ఈ చంద్రగ్రహణం పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:20 గంటల తర్వాత గ్రహణం ప్రారంభమైనప్పటికీ, ఆ సమయంలో చంద్రుడు దిగంతానికి దిగువన ఉండటంతో మన దేశంలో కనిపించలేదు. సాయంత్రం 6:26 గంటలకు చంద్రోదయం తర్వాతే గ్రహణాన్ని వీక్షించే అవకాశం లభించింది. ముఖ్యంగా సాయంత్రం 6:33 నుంచి 6:40 గంటల మధ్యలో గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు, చంద్రుడు తూర్పు దిక్కున ఎర్రని నారింజ రంగులో అద్భుతంగా కనిపించాడు. రాత్రి 6:47 గంటలకు గ్రహణం పూర్తిగా ముగిసింది.

దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాలైన ఇండోర్ వంటి నగరాల్లో చంద్రోదయం సమయంలోనే గ్రహణం గరిష్ఠ దశలో ఉండటంతో, ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ఈ ఖగోళ వింతను చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకపోయింది.

చంద్రగ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయాల ప్రకారం 'సూతక్ కాలం' పాటించారు. ఉదయం గ్రహణం ప్రారంభానికి ముందే సూతక్ మొదలై, సాయంత్రం 6:47 గంటలకు గ్రహణం ముగిశాక పూర్తయింది. ఈ సమయంలో చాలామంది శుభకార్యాలకు దూరంగా ఉండి, ఉపవాసాలు పాటించారు. తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆలయాలను మూసివేశారు.

సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మళ్లీ ఇటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 చివరి వరకు కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని చాలా మంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల.. శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం

చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేసిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలు రాత్రి తిరిగి తెరుచుకున్నాయి. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కైంకర్యాలు పూర్తి చేసి రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

మంగళవారం మధ్యాహ్నం 3:26 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగింది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణానికి ఆరు గంటల ముందుగానే అంటే ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులను మూసివేశారు. గ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి, శుద్ధి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

భక్తుల దర్శనాలతో పాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ కూడా తిరిగి ప్రారంభమైంది. రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. అదేవిధంగా, లడ్డూ విక్రయ కౌంటర్లను కూడా తెరిచి భక్తులకు అందుబాటులో ఉంచారు. దీంతో గ్రహణం కారణంగా రోజంతా శ్రీవారి దర్శనానికి దూరమైన భక్తులు రాత్రి నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Chandragrahanam
Lunar Eclipse
Blood Moon
Tirumala
SreeVari Temple
సూతక్ కాలం
సూతక్
Hindu traditions
Annaprasadam
Sree Venkateswara Swamy

More Telugu News