జూమ్ చేసి హీరోయిన్ల ఫొటోలు తీయడమేమిటి?: నటి సప్తమి గౌడ ఆగ్రహం

  • అభ్యంతర కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి పోస్టు చేస్తున్నారని మండిపాటు
  • కొందరు వ్యక్తులు అనుసరిస్తున్న తీరు సరికాదని వ్యాఖ్య
  • జూమ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రుక్మిణి వసంత్, అషిక రంగనాథ్ ఆగ్రహం
పబ్లిక్ ఈవెంట్‌లలో పాల్గొంటున్న సినీ నటీమణులను అభ్యంతర కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేస్తున్నారని ప్రముఖ కన్నడ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత కోణాల్లో జూమ్ చేసి పోస్టు చేయడం సరికాదని ఆమె కొంతమంది ఫొటో, వీడియో గ్రాఫర్లపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ది రైజ్ ఆఫ్ అశోకలో సప్తమి గౌడ నటించారు.

తాజాగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా నటీమణులను అనుచితంగా చూపిస్తూ చేస్తున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణుల శరీరాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పెడుతూ కొందరు వ్యక్తులు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని అన్నారు. ఇది మహిళలను అవమానించడమేనని పేర్కొన్నారు. మేం మా నటన ద్వారా అలరించడానికి మాత్రమే సినిమాల్లో ఉన్నామని అన్నారు.

ఉద్దేశపూర్వకంగా వీడియోలను, ఫొటోలను జూమ్ చేసి పోస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈవెంట్‌లను కవర్ చేసే వారు కూడా తమ వృత్తికి గౌరవం ఇచ్చేలా వ్యవహరించాలని సూచించారు. తద్వారా వారు తమ మర్యాదను కాపాడుకోవాలని అన్నారు. ఈ విషయంలో ప్రతి నటీమణికి తాము అండగా ఉంటామని, పరస్పరం మద్దతుగా నిలుస్తామని అన్నారు. నటీమణుల పట్ల అనుచితంగా ఉన్న కొంతమందికి వ్యతిరేకంగా అందరూ అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదే అంశంపై రుక్మిణి వసంత్, ఆషికా రంగనాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. నటీమణుల శరీరాలను జూమ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాజిక మాధ్యమ వేదికగా ప్రశ్నించారు. పరిశ్రమలో ఉన్న మహిళలందరూ ఈ సమస్యపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కొందరు వ్యక్తులు అనుసరిస్తున్న తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అవయవాలను జూమ్ చేసి తీయడం ఇతరుల గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. వృత్తి ధర్మాన్ని పాటించడం, కనీస మర్యాద, సభ్యతను మీ నుంచి మేం కోరుకుంటున్నం అని పేర్కొన్నారు.


More Telugu News