సంజూకు సూర్య సలాం.. గంభీర్ ఆలింగనం

  • వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్
  • 97 పరుగులతో చెలరేగి జట్టును సెమీస్‌కు చేర్చిన వైనం
  • సంజూకు సెల్యూట్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్
  • ఆలింగనం చేసుకుని అభినందించిన కోచ్ గంభీర్
  • సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించి, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరును ఖరారు చేసుకుంది.

జట్టును గెలిపించి పెవిలియన్ వైపు వస్తున్న సంజూ శాంసన్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి గౌరవంగా సెల్యూట్ చేశాడు. అదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సంజూను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. క్రీడాస్ఫూర్తిని చాటిన ఈ రెండు సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి సత్తా చాటాడు. గతవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సంజూను జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కీలకమైన మ్యాచ్‌లో జట్టులోకి తిరిగి వచ్చి అద్భుత ప్రదర్శన చేయడం విశేషం.

మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. "సంజూ ఒక ప్రపంచ స్థాయి ఆటగాడు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో అతను నిలబడ్డాడు" అని గంభీర్ కొనియాడాడు. ఈ విజయంతో భారత్ మార్చి 5న ముంబైలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.


More Telugu News