Kondapalli Srinivas: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలు ఆందోళనకు గురికావొద్దు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Kondapalli Srinivas urges AP people in Gulf not to worry
  • గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని సూచన 
  • ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని వినతి
  • ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్
ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని కావున గల్ప్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.  

ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని సూచించారు. 

ఆయా దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు సరైన సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్దరిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు, ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి  తెలిపారు. ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరినీ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

అత్యవసర పరిస్థితులలో ఏపీ ఎన్నార్టీ హెల్ప్ లైన్ నెంబర్లు +91 8500027678, +91 0863 2340678 నంబర్లకు, మరింత సమాచారం కోసం https://apnrts.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఏ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా, స్థానిక అధికారులు, అధికారిక మీడియా ప్రకటనల సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ కోరారు.
 
Kondapalli Srinivas
AP NRTS
Andhra Pradesh
Gulf Countries
Indian Embassy
Iran
Israel
Chandrababu Naidu
NRI Affairs
AP Government

More Telugu News