క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం: సీఎం చంద్రబాబు

  • 15 ఏళ్లలోపు బాలికలకు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ షురూ
  • ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు కీలక హామీ
  • వైద్య రంగానికి బడ్జెట్‌లో 6 శాతంతో నిధుల వెల్లువ
  • గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకూ భంగం కలిగించారంటూ ఫైర్
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నామని, ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసలో శనివారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ... క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.

మహిళల్లో అత్యధికంగా వస్తున్న సర్వైకల్ క్యాన్సర్‌ను అరికట్టేందుకు 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ టీకాలను ఉచితంగా అందిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. బయట మార్కెట్లో రూ.4 వేలు ఉండే ఈ టీకాను, రాష్ట్రంలోని 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా అందించేందుకు రూ.14.11 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కర్నూలులో రూ.50 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నామని, తాజా బడ్జెట్‌లో వైద్య రంగానికి ఏకంగా రూ.19,305 కోట్లు కేటాయించామని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖలో డేటా సెంటర్ల రాకతో ఈ ప్రాంత ముఖచిత్రం మారిపోనుందని చెప్పారు.

గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత పాలకులు ప్రజలనే కాకుండా దేవుడిని కూడా మోసం చేశారని, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కాజేయాలని చూస్తే, తాము అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు భరోసా కల్పించామని గుర్తుచేశారు. సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ’ ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.


More Telugu News