Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటన స్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Inspects Fire Accident Site in Kakinada
  • కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా కేంద్రం పేలుడు
  • ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • 21 మంది మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
  • క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన చంద్రబాబు
  • ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటన
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిని స్వయంగా పరిశీలించిన సీఎం.. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను చూసి చలించిపోయారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. 

ప్రమాద తీవ్రత, పేలుడుకు గల కారణాలపై అక్కడికక్కడే అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి అధికారులతో సమీక్షించారు. సీఎం వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' పరిశ్రమలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 21 మంది మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై సమీపంలోని పొలాల్లో ఎగిరిపడటం అత్యంత బాధాకరమని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థల పరిశీలన అనంతరం సామర్లకోట ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా సీఎం ఈ సందర్భంగా పరామర్శించారు.

కాగా, భద్రతా లోపాలు, అజాగ్రత్తల వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Chandrababu Naidu
Andhra Pradesh
fire accident
firecrackers explosion
Kakinada district
Samarlakota
accident compensation
fireworks industry
Narendra Modi
Revanth Reddy

More Telugu News