పశ్చిమ బెంగాల్‌లో తాజాగా 8 లక్షల ఓట్ల తొలగింపు... 66 లక్షలకు చేరిన తొలగింపు

  • గత సంవత్సరం 58 లక్షల ఓట్ల తొలగింపు
  • పరిశీలన జాబితాలో మరో 60 లక్షలకు పైగా ఓటర్లు
  • మరణాలు, నకిలీలు, వలసల వంటి కారణాలతో ఓట్ల తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ ప్రకారం, మొత్తం 66 లక్షల మంది ఓటర్లను తొలగించారు.

గత సంవత్సరం ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో 58 లక్షల ఓట్లు తొలగించగా, ఈసారి 8 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో తొలగించిన ఓటర్ల సంఖ్య 66 లక్షలకు చేరింది. అదేవిధంగా మరో 60 లక్షలకు పైగా ఓటర్లను పరిశీలన జాబితాలో చేర్చారు. ఈ ఓటర్ల వివరాలను జ్యూడిషియల్ అధికారులు తనిఖీ చేయనున్నారు.

మొత్తం 7.66 కోట్లమంది ఓటర్ల జాబితాతో గత సంవత్సరం నవంబర్ 4న బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 16న ముసాయిదా జాబితాను విడుదల చేశారు. మరణాలు, వలసలు, నకిలీల వంటి కారణాలతో 58 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 7.08 కోట్లకు తగ్గింది.

విచారణలు, పరిశీలనల అనంతరం తాజాగా అదనంగా 8 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. 7.08 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటి వరకు దాదాపు 6.4 కోట్ల మందిని ఆమోదిత జాబితాలో చేర్చారు. తుది జాబితా విడుదలైన తర్వాత గణాంకాలపై నిర్ధారణకు రావొచ్చని అధికారులు వెల్లడించారు.


More Telugu News