అందుకే అమెరికాతో కలిసి ఇరాన్‌పై ఆపరేషన్ నిర్వహించాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

  • క్షిపణి స్థావరాలను, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డుపై దాడులు చేస్తున్నట్లు వెల్లడి
  • ఐదు దశాబ్దాలుగా ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ పాలన ముప్పుగా పరిణమించిందన్న నెతన్యాహూ
  • అణ్వాయుధాలతో మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదని వ్యాఖ్య
ఇరాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉందని, అటువంటి భయాలను తొలగించేందుకు అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. టెహ్రాన్‌పై దాడులను నెతన్యాహూ సమర్థించుకున్నారు. ఇరాన్‌లో ఉన్న క్షిపణి స్థావరాలను, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డు, బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్ల పైనా దాడులు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ పాలన ముప్పుగా పరిణమించిందని అన్నారు.

ఇరాన్ పాలన ఎంతోమంది అమెరికన్లను బలి తీసుకుందని, తమ దేశ పౌరులను ఊచకోత కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ తన అణ్వాయుధాలతో మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదని నెతన్యాహూ అన్నారు.

ఇరాన్‌లోని అన్ని వర్గాలకు నిరంకుశ పాలన నుంచి విముక్తి, స్వేచ్ఛ, శాంతిని పొందే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతలు ఉన్నందున సైన్యం ఆదేశాలను ఇజ్రాయెల్ పౌరులు పాటించాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ మున్ముందు కొనసాగే అవకాశం ఉందని, కలిసికట్టుగా ధైర్యంగా పోరాడాల్సి ఉందని అన్నారు.


More Telugu News