మాస్ హీరో బాలయ్యతో వివేక్ ఆత్రేయ.. టాలీవుడ్‌లో క్రేజీ కాంబో!

  • ముంబై మాఫియా నేపథ్యంలో పవర్‌ఫుల్ డాన్‌గా బాలకృష్ణ   
  • భారీ కథ కావడంతో రెండు భాగాలుగా తీసే ఆలోచనలో మేకర్స్
  • మార్చి 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం 
వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అనూహ్యమైన కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి' వంటి క్లాస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న వివేక్ ఆత్రేయ, ఈసారి తన పంథాకు భిన్నంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు సరిపోయే భారీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ స్పాన్ చాలా పెద్దదిగా ఉండటంతో దీనిని ఒకే సినిమాగా కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించాలా? అనే విషయంపై దర్శకనిర్మాతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోను క్లాస్ చిత్రాల దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడనే కుతూహలం అభిమానుల్లో, సినీ వర్గాల్లో నెలకొంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. బాలయ్య‌ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా, బాలయ్యను మహారాజుగా చూపించాలని అనుకున్నప్పటికీ.. బడ్జెట్ కారణాల వల్ల కథలో మార్పులు చేశారు. తాజా సమాచారం ప్రకారం ముంబై మాఫియా నేపథ్యంలో సాగే కథలో బాలయ్య పవర్‌ఫుల్ డాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుండగా, దసరాకు విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒకవైపు గోపీచంద్ మలినేనితో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, మరోవైపు వివేక్ ఆత్రేయతో ప్రయోగాత్మక భారీ చిత్రం ఉండటంతో బాలయ్య లైనప్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. తన కెరీర్‌లోనే అత్యంత భారీ కథతో రాబోతున్న వివేక్ ఆత్రేయ, బాలయ్యను ఏ స్థాయిలో చూపిస్తారో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.


More Telugu News