కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్ రావడంపై అన్నాహజారే స్పందన... కేజ్రీకి కీలక సూచన

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 21 మందికి క్లీన్ చిట్ వచ్చింది. సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు వారికి భారీ ఊరట కల్పించింది. కేజ్రీవాల్, సిసోడియాకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అన్నా హజారే స్వాగతించారు.

న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, ఈ వ్యవస్థ లేకుంటే గందరగోళ పరిస్థితి, అశాంతి నెలకొంటుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను కేజ్రీవాల్‌పై విమర్శలు చేసినప్పుడు, కోర్టు అప్పటికింకా ఎలాంటి తీర్పును వెలువరించలేదని వివరణ ఇచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఆయన సలహా ఇచ్చారు. వ్యక్తిగతంగా లేదా పార్టీ గురించి మాత్రమే ఆలోచించకుండా సమాజం, దేశం కోసం పనిచేయాలని హితవు పలికారు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థ వల్లే దేశం సరైన మార్గంలో నడుస్తోందని అన్నారు. బలమైన న్యాయవ్యవస్థ లేకుంటే నేరస్థులదే పైచేయి అవుతుందని వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal
Anna Hazare
Delhi Liquor Policy Case
Manish Sisodia
Aam Aadmi Party
Clean Chit

More Telugu News