లిక్కర్ కేసులో కవితకు 'క్లీన్ చిట్'.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు!
- సంచలన తీర్పును వెలువరించిన రౌస్ అరెన్యూ కోర్టు
- సరైన ఆధారాలు లేవంటూ కవితపై కేసు కొట్టివేత
- ధర్మమే గెలిచింది అంటున్న జాగృతి మద్దతుదారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో 'క్లీన్ చిట్' ఇచ్చింది.
సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితుడిగా కొనసాగించలేమని, తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని తేల్చి చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపై ఉన్న కేసులను కొట్టివేసింది.
మద్యం పాలసీ కేసులో కవిత సుమారు ఐదు నెలల పాటు తీహార్ జైలులో ఉండి, బెయిల్పై విడుదలయ్యారు. దర్యాప్తు సంస్థలు తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె మొదటి నుంచీ వాదిస్తూ వచ్చారు. తాజాగా కోర్టు తీర్పుతో కవిత వాదనకు బలం చేకూరినట్లయింది. కోర్టు తీర్పు వెలువడగానే తెలంగాణవ్యాప్తంగా జాగృతి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ధర్మమే గెలిచింది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.