నేపాలీ మహిళపై ఆటో డ్రైవర్, స్నేహితుల గ్యాంగ్ రేప్.. గురుగ్రామ్‌లో ఘోరం

  • స్నేహితురాలి కోసం వచ్చి దారి తప్పిన బాధితురాలు..
  • స్పృహ తప్పిన మహిళను గదికి తీసుకెళ్లి అఘాయిత్యం..
  • ఆటో డ్రైవర్ అరెస్ట్.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసుల వేట


హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నేపాల్‌ కు చెందిన 32 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కురుక్షేత్రలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధితురాలు.. తన స్నేహితురాలిని కలిసేందుకు మంగళవారం గురుగ్రామ్‌ కు వచ్చింది. అయితే, స్నేహితురాలు కనిపించకపోవడంతో అసంతృప్తికి గురై మద్యం సేవించింది.

లిఫ్ట్ ఇస్తామని నమ్మించి..

మద్యం మత్తులో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేందుకు ఒక ఆటో రిక్షా ఎక్కింది. ఆ ఆటోలో అప్పటికే డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో తెలిసేలోపే, నిందితులు ఆమెను నహర్‌పూర్ రూపా ప్రాంతంలోని ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బుధవారం ఉదయం ఆమెకు స్పృహ వచ్చేసరికి తాను ఒక తెలియని గదిలో ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తేరుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

డ్రైవర్ అరెస్ట్..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి ప్రధాన నిందితుడు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.



More Telugu News