బాబా వేషంలో కామాంధుడు.. బాలికతో అసభ్య ప్రవర్తన, పోక్సో కేసు నమోదు

  • కర్ణాటకలో ఓ మఠాధిపతి దారుణం
  • ఏడేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన మల్లికార్జున ముత్య
  • లైకుల కోసం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన తల్లిదండ్రులు
  • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు, ప్రస్తుతం పరారీలో బాబా
  • బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి చర్యలు
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ మఠాధిపతి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని షహాపుర్ తాలూకాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యగా గుర్తించారు.

మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ కుటుంబం తమ బంధువు పుట్టినరోజు వేడుకల కోసం ఈ మఠానికి వచ్చింది. ఈ క్రమంలో పీఠాధిపతి అయిన మల్లికార్జున ముత్య ఆ కుటుంబంలోని ఏడేళ్ల చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ముద్దులు పెట్టాడు. అయితే, ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన తల్లిదండ్రులు.. బాబా ఆశీస్సులు ఇస్తున్నాడని భావించి, ఆ దృశ్యాలను తమ ఫోన్‌లో వీడియో తీశారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ఆ వీడియోను అప్‌లోడ్ చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్పందించి విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణ అనంతరం గోగి పోలీస్ స్టేషన్‌లో నిందితుడైన మల్లికార్జున ముత్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలియగానే నిందితుడు మఠం నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలైన చిన్నారికి అధికారులు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఇలాంటి చర్యలు, చిన్నారుల పట్ల తల్లిదండ్రుల అవగాహన లోపంపై ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.


More Telugu News