భారత్ సెమీస్ ఆశలు.. నేటి మ్యాచ్‌ల ఫలితాలపైనే భవితవ్యం

  • దక్షిణాఫ్రికాతో ఓటమితో సంక్లిష్టంగా మారిన భారత్ సెమీస్ అవకాశాలు
  • నేడు జింబాబ్వేతో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ కీలక పోరు
  • భారత్, దక్షిణాఫ్రికా గెలిస్తే సెమీస్ రేసు సులభం
  • జింబాబ్వేతో ఓడితే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతే
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా సెమీ ఫైనల్ ప్రయాణం సంక్లిష్టంగా మారింది. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే రెండు మ్యాచ్‌లు భారత్ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు భారత్-జింబాబ్వే తలపడనున్నాయి.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీమిండియా సెమీస్ చేరాలంటే పలు అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జట్టు చేతిలో ఉండగా, మరికొన్ని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి.

అనుకూల ఫలితం
ఈరోజు జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే సెమీస్ రేసు సులభమవుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. భారత్, వెస్టిండీస్ చెరో 2 పాయింట్లతో ఉంటాయి. ఈ సంద‌ర్భంలో మార్చి 1న భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. నెట్ రన్ రేట్‌తో సంబంధం ఉండదు.

క్లిష్టమైన సమీకరణం
ఒకవేళ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్, జింబాబ్వేపై భారత్ గెలిస్తే పరిస్థితి ఉత్కంఠగా మారుతుంది. అప్పుడు వెస్టిండీస్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుతుంది. భారత్, దక్షిణాఫ్రికా చెరో 2 పాయింట్లతో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియా తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి లేదా స్వల్ప తేడాతో గెలవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.

అత్యంత క్లిష్టమైన పరిస్థితి
ఒకవేళ టీమిండియా అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓడిపోతే, సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. అయినప్పటికీ సాంకేతికంగా ఒక చిన్న అవకాశం ఉంటుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో (వెస్టిండీస్, జింబాబ్వేపై) గెలవాలి. అలాగే భారత్ తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అత్యంత భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో అర్హత సాధిస్తుంది. భారత్, వెస్టిండీస్, జింబాబ్వే 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టుకు అవకాశం లభిస్తుంది.

ఏదేమైనా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ముందుగా జింబాబ్వేపై తప్పక గెలవాలి. ఆ తర్వాతే మిగిలిన సమీకరణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


More Telugu News