ఎన్‌సీఈఆర్టీలో న్యాయవ్యవస్థలో అవినీతి పాఠ్యాంశం.. స్పందించిన కేంద్రం

  • 8వ తరగతి పాఠ్యాంశంగా న్యాయవ్యవస్థలోని అవినీతి అంశం
  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
  • ఈ పాఠ్యాంశాన్ని తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడి
ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో ప్రవేశపెట్టిన న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి అంశాన్ని తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశాన్ని పాఠ్యపుస్తకంలో ప్రవేశ పెట్టడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.

వివాదాస్పద అంశాలను తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ఇలాంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాయి. అలాంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం సముచితం కాదని, స్ఫూర్తిదాయక అంశాలు పొందుపరచవలసి ఉండాల్సిందని ఆ వర్గాలు తెలిపాయి. "ఇది సరైనది కాదు మరియు సముచితం కాదు" అని మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ని ఉటంకిస్తూ వెల్లడించాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి.

8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎన్‌సీఈఆర్టీ బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామం అందరినీ కలవరానికి గురి చేసిందని, న్యాయ వ్యవస్థ పటిష్ఠతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది.


More Telugu News