అవకాశాలు ఉన్నప్పుడే మేల్కోవాలి.. లేకపోతే ఏమీ మిగలదు: తమన్నా

  • ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నప్పుడే ఇతర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలన్న తమన్నా
  • లేకపోతే కెరీర్ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
  • తాను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టానని వెల్లడి

గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించాలని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు వరుస కడుతున్న సమయంలోనే ఇతర ఆదాయ మార్గాలను వెతుక్కోవాలని, లేనిపక్షంలో కెరీర్ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే వెండితెరకు పరిచయమై, గత 21 ఏళ్లుగా అగ్ర హీరోల సరసన నటిస్తూ తనదైన ముద్ర వేసిన తమన్నా, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక క్రమశిక్షణ వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు.


తమ కెరీర్ ఆరంభం నుండి తండ్రి అందించిన మార్గనిర్దేశమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని తమన్నా పేర్కొన్నారు. "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నే చూసుకునేవారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈరోజు నేను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టగలిగాను. నటీనటులకు దూరదృష్టి చాలా అవసరం. చేతి నిండా పని ఉన్నప్పుడే సంపాదనను సరైన మార్గాల్లో మళ్లించాలి. లేదంటే చివరకు ఏమీ మిగలదు" అంటూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం నటనతో పాటు సొంతంగా నగల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్న తమన్నా, తన తండ్రి నేర్పిన ఆర్థిక ప్రణాళికలే తన భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు.


ఇక సినిమాల పరంగా చూస్తే, ఈ ఏడాది తమన్నా భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రం మే 15న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు అజయ్ దేవగణ్, సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ‘రేంజర్’ చిత్రంలో కూడా తమన్నా ఒక కీలక పాత్రలో మెరవనున్నట్లు సమాచారం.



More Telugu News