విండీస్ భారీ విజయంతో టీమిండియాకు చిక్కులు.. సెమీస్ చేరాలంటే ఇవే దారులు

  • జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో భారీ విజయం
  • టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టం
  • నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సిన ఒత్తిడిలో భారత్
  • దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం
  • మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధిస్తేనే భారత్‌కు అవకాశం
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. నిన్న‌ ముంబైలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితం భారత్ సెమీస్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఒత్తిడిలో ఉన్న భారత్‌కు, వెస్టిండీస్ సాధించిన ఈ భారీ విజయం నెట్ రన్ రేట్ (NRR) పరంగా పెద్ద దెబ్బేసింది. దీంతో భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో కేవలం గెలవడమే కాకుండా, భారీ తేడాతో విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్ సెమీస్ అవకాశాలు ఇవే..
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో బుధవారం చెన్నైలో జింబాబ్వేతో తలపడనుంది. అదే రోజు అహ్మదాబాద్‌లో జరిగే మరో కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్ సెమీస్ మార్గం కొంత సులభమవుతుంది.

సమీకరణం 1: భారత్ రెండు మ్యాచ్‌లూ గెలిస్తే..
భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో (వెస్టిండీస్, జింబాబ్వే) గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా తన మూడు సూపర్ 8 మ్యాచ్‌లలోనూ గెలిస్తే, భారత్ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, దక్షిణాఫ్రికా గనుక వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్‌కు వెళ‌తాయి.

సమీకరణం 2: భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే..
భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటే గెలిస్తే, సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆ గెలుపు తప్పనిసరిగా వెస్టిండీస్‌పైనే అయి ఉండాలి. ఒకవేళ భారత్.. విండీస్‌పై గెలిచి, జింబాబ్వే చేతిలో ఓడితే, అప్పుడు దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలవాలి. అలా జరిగితే భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ 2 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేటే సెమీస్ బెర్త్‌ను నిర్ణయిస్తుంది. 


More Telugu News