ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... ఆంధ్రులు తిరిగొచ్చేయాలన్న మంత్రి కొండపల్లి

  • ఇరాన్‌లోని ఆంధ్రులు వెంటనే తిరిగి రావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
  • అక్కడ క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన
  • నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలన్న మంత్రి శ్రీనివాస్ 
  • సహాయం కోసం ఏపీఎన్‌ఆర్టీ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ను సంప్రదించాలని విజ్ఞప్తి
ఇరాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రవాసాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.  

ఇరాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చన్న అంచనాలు, విద్యార్ధుల ఆందోళనలతో పరిస్థితులు మళ్లీ గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారత పౌరులకు మన దేశ ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. 

ఈ క్రమంలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ .. ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలకు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని కోరారు. 

పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అక్కడి భారత రాయబార కార్యాలయంతో, ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీ) అధికారులతో టచ్‌లో ఉండాలని మంత్రి శ్రీనివాస్ సూచించారు. ఏదైనా సహాయం అవసరమైతే, ఏపీఎన్‌ఆర్టీ ఏర్పాటు చేసిన 24/7 హెల్ప్‌లైన్‌ నంబరు +91 8500027678 ను సంప్రదించాలని ఆయన తెలిపారు. 


More Telugu News