బంగారం ధరల పెరుగుదలకు కారణం అదే: నిర్మలా సీతారామన్

  • కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయన్న నిర్మలా సీతారామన్
  • బంగారం దిగుమతులపై ఆందోళన చెందడం లేదన్న నిర్మలా సీతారామన్
  • పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను పెంచాలని విజ్ఞప్తి
ప్రపంచంలోని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, పసిడి ధరల అనూహ్య పెరుగుదలకు ఇదే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని అన్నారు. వాటిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు.

బంగారం దిగుమతులపై తాము ఆందోళన చెందడం లేదని, కరెంట్ ఖాతా లోటు నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని వెల్లడించారు. బ్యాంకులు తమ కోర్ వ్యాపారంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. భారత్ వృద్ధి పథంలో పయనిస్తోందని, అందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను పెంచాలని నిర్మలా సీతారామన్ కోరారు.

అమెరికా టారిఫ్ అంశంపై కూడా ఆమె స్పందించారు. వివిధ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో భారత్ సహా అన్ని దేశాలపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మార్పుల ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సమీక్షిస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ అంశంపై అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని అన్నారు.

Nirmala Sitharaman
Gold price increase
RBI
Gold imports
Current account deficit
Central banks gold purchase

More Telugu News