శ్రీలంకతో సూపర్-8 మ్యాచ్... పరుగుల కోసం చెమటోడ్చిన ఇంగ్లండ్

  • టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో ఇంగ్లండ్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • ఫిల్ సాల్ట్ (62) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం
  • చెలరేగిన లంక బౌలర్లు.. వెల్లలాగేకు మూడు వికెట్లు
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ జట్టు పరుగుల కోసం చెమడోట్చింది. పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక, ప్రత్యర్థిని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (62) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (6) కూడా నిరాశపరిచారు. ఈ దశలో క్రీజులో నిలదొక్కుకున్న ఫిల్ సాల్ట్ ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కేవలం 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే, శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. హ్యారీ బ్రూక్ (14), సామ్ కరన్ (11), విల్ జాక్స్ (21) కాసేపు క్రీజులో ఉన్నా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వెల్లలాగేతో పాటు మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక తలో రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. దీంతో శ్రీలంక ముందు 147 పరుగుల లక్ష్యం నిలిచింది.


More Telugu News