దేశంలోనే వేగవంతమైన మెట్రో... మీరట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ

  • గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనున్న మెట్రో
  • నమో భారత్ రైలు సేవలను కూడా ప్రారంభించిన ప్రధాని మోదీ
  • పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్
దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ మెట్రో గంటకు గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మీరట్ మెట్రో దేశంలోనే అతి వేగవంతమైన మెట్రో వ్యవస్థగా నిలిచింది.  మీరట్ మెట్రో సేవలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆధునిక రవాణా వ్యవస్థతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా నమో భారత్ రైలు సేవలను కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) కారిడార్‌పైనే మీరట్ మెట్రో కూడా నడవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దేశంలో ఒకే మౌలిక వసతులపై రెండు వేర్వేరు రైలు సేవలు నడవడం ఇదే తొలిసారి. నమో భారత్ రైలు సాధారణంగా గంటకు 160 కి.మీ., గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రూ.12,390 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. 82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్ కారిడార్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. దీంతో ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 




More Telugu News