ఏఐ సదస్సులో ఆ రెండు అవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయి: 'మన్ కీ బాత్‌'లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల ముగిసిన 'ఏఐ ఇంపాక్ట్' సదస్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దీని ద్వారా కృత్రిమ మేధ రంగంలో భారతదేశ అద్భుతమైన సామర్థ్యాలను ప్రపంచానికి చూపించామని అన్నారు. ఆదివారం 131వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ దేశాలను ఆకర్షించిందని అన్నారు.

ఈ సదస్సులో ముఖ్యంగా మన రెండు ఆవిష్కరణలు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని తెలిపారు. జంతువుల చికిత్సకు వాటిని ట్రాక్ చేయడానికి 'ఏఐ'ని ఉపయోగించడం, భారత పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని సంరక్షించడానికి ఏఐను ఉపయోగించడం చూసి ప్రపంచ నేతలు ప్రశంసించారని అన్నారు. నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్టప్ రంగాలకు చెందిన వారు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు.

కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధన, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ సహా అభివృద్ధి చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగిస్తూ భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మన యువత ఆవిష్కరణలతో దేశ కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉందని అన్నారు. ఈ సదస్సు ద్వారా మన యువత ప్రతిభను ప్రపంచానికి చూపించగలిగామని అన్నారు. 

సైబర్ నేరాలపై హెచ్చరిక

సైబర్ నేరాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అవయవదానానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ప్రధాని మోదీ ప్రశంసించారు. బిడ్డను కోల్పోయిన బాధలోనూ వారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. వారి నిర్ణయం నలుగురికి జీవనదాతగా మారిందని పేర్కొన్నారు.

Narendra Modi
AI Impact Summit
Mann Ki Baat
Artificial Intelligence
India AI
Cyber Crime
Digital Arrest

More Telugu News