Katipally Venkata Ramana Reddy: కాటిపల్లి ఇంటిపై కాంగ్రెస్ గూండాయిజం చేసింది.. రేవంత్ సమాధానం చెప్పాలి: ఈటల రాజేందర్

Congress Goondaism on Katipally Venkata Ramana Reddy House Blame Revanth Reddy Etela Rajender
  • ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న ఎంపీ
  • సామాన్యులకు రక్షణ ఎలా ఇస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలని నిలదీత
  • కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని కాటిపల్లి ఓడించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్య
కామారెడ్డి బీజేపీ శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. వెంకటరమణారెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిపై స్పందించారు.

ఒక ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ పార్టీ దాడి చేసి గూండాయిజం చేస్తోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఇస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించరని, హింసను క్షమించరని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించారని, ఆ తర్వాత అక్కడ బీజేపీ క్రమంగా మరింత బలపడుతోందని, దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అల్లర్లకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ దాడికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అన్నారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని పేర్కొన్నారు.
Katipally Venkata Ramana Reddy
Etela Rajender
Revanth Reddy
Kamareddy
Telangana Politics

More Telugu News