తల్లి పాత్రతో వెబ్ సీరీస్ లోకి మీనా

  • రోస్లిన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మీనా
  • ఆనాటి దీపావళి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నటి
  • నేటి తరం పిల్లల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు
వెండితెరపై దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన నటి మీనా, ఇప్పుడు డిజిటల్ దునియాలోకి అడుగుపెడుతున్నారు. ఆమె నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ ఈ నెల 27 నుంచి జియో హాట్‌స్టార్‌ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణంలోని ఒడిదుడుకులు, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు.

షూటింగ్ సెట్టే ‘పండగ’.. అమ్మ నేర్పిన పాఠం
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పండగలు, పబ్బాలు కూడా జరుపుకోలేనంత బిజీగా ఉండేవారట మీనా. ‘‘అందరూ ఇంట్లో టపాసులు కాలుస్తుంటే, నేను మాత్రం మేకప్‌ తో సెట్‌ లో ఉండేదాన్ని. నాకిష్టమైన పండగలను మిస్ అవుతున్నానని చాలా బాధపడ్డా’’ అని ఆనాటి రోజులను మీనా గుర్తుచేసుకున్నారు. అయితే, ఆమె తల్లి చెప్పిన ఒకే ఒక్క మాట మీనా ఆలోచనను మార్చేసింది. ‘‘పండగ ఎవరైనా చేసుకుంటారు.. కానీ వందల మంది కొత్త వ్యక్తుల మధ్య, కొత్త ప్రదేశాల్లో పని చేసే అవకాశం మాత్రం అందరికీ రాదు’’ అని అమ్మ చెప్పిందన్నారు. అప్పటి నుంచి పనిలోనే పండగను వెతుక్కోవడం నేర్చుకున్నానని మీనా తెలిపారు.

తల్లిగా మారాకే ఆ పాత్రలకు ప్రాణం..
‘రోస్లిన్’ సిరీస్‌లో మీనా తల్లి పాత్రలో కనిపించబోతున్నారు. ‘‘నేను స్వయంగా తల్లిని కాకముందు చేసిన పాత్రలకు, ఇప్పడు చేస్తున్న పాత్రలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆ ఎమోషన్స్ నా మనసు లోతుల్లో నుంచి వస్తున్నాయి. ప్రతి డైలాగ్ నా జీవితానికి కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది” అని అన్నారు.

నేటి పిల్లలకు అన్నీ తెలుసు..
ఇప్పటి తరం పిల్లల గురించి మీనా ప్రాక్టికల్‌గా స్పందించారు. ‘‘ఈ జనరేషన్ పిల్లలకు మనం ఏది చెప్పినా ‘మాకు తెలుసులే’ అనేస్తారు. వారికి అన్ని విషయాలపై విపరీతమైన అవగాహన ఉంది. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని వివరించడం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత అని, అంతకుమించి వారిని నియంత్రించడం కష్టం” అని ఆమె అభిప్రాయపడ్డారు.


More Telugu News