'ఏఐ'ని క్రమం తప్పకుండా వాడకుంటే ప్రమోషన్లు ఉండవు: యాక్సెంచర్ కీలక నిర్ణయం

  • ఏఐ టూల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు యాక్సెంచర్ సూచన
  • వాటి వినియోగం ఆధారంగా కూడా లీడర్‌షిప్ రోల్స్ అందుకుంటారని స్పష్టీకరణ
  • సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లకు కంపెనీ మెయిల్
ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్, ప్రమోషన్ల అర్హతలో కృత్రిమ మేధ (ఏఐ)ను క్రమం తప్పకుండా ఉపయోగించడం ఒక కీలకమైన అంశంగా మార్చింది. సీనియర్ ఉద్యోగులు 'ఏఐ' టూల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని యాక్సెంచర్ సూచించింది. వాటి వినియోగం ఆధారంగా కూడా లీడర్‌షిప్ రోల్స్ అందుకుంటారని, లేదంటే ప్రమోషన్లు ఉండవని సంకేతాలు ఇచ్చింది.

కంపెనీలు డిజిటల్ మార్పును వేగవంతంగా అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగం 'ఏఐ'ని అందిపుచ్చుకుని మెరుగైన పనితీరును కనబరచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో యాక్సెంచర్ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి ఈ కీలక సూచన చేసింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లకు కంపెనీ మెయిల్ ద్వారా ఈ సందేశం పంపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

లీడర్‌షిప్ పాత్రలో ఎదగడానికి ఏఐ సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగించాలని స్పష్టం చేసింది. క్లయింట్లకు అత్యుత్తమ, వేగవంతమైన సేవలు అందించడానికి ఇది అవసరమని యాక్సెంచర్ భావిస్తోంది. యాక్సెంచర్ కొంతకాలంగా ఏఐపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏఐతో రీస్కిల్ చేయడం సాధ్యంకాని ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

మరోవైపు, కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని గూగుల్ ఇటీవల తెలిపింది. ఇందుకోసం విరమణ ప్యాకేజీని కూడా ప్రకటించింది. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ తదితర టెక్ దిగ్గజాలు కూడా గూగుల్ బాటలోనే పయనించాయి.


More Telugu News