రేపిస్ట్ కులవర్ధన్‌కు దారుణ ముగింపు.. చెత్తబండిలో తరలించి అంత్యక్రియలు

  • మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన తల్లి, బంధువులు
  • చెత్త తరలించే ఆటోలో డెడ్‌బాడీ తరలించి అంత్యక్రియలు జరిపిన పురపాలక సిబ్బంది
  • నిందితుడి మృతితో న్యాయం జరిగిందంటూ మదనపల్లెలో ప్రజల సంబరాలు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్‌కు అత్యంత దారుణమైన ముగింపు లభించింది. కడసారి చూపునకు కూడా కన్నతల్లి నిరాకరించడంతో, అతని మృతదేహానికి మున్సిపల్ సిబ్బందే అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చెత్త తరలించే ఆటోలో తరలించి దహన సంస్కారాలు పూర్తిచేశారు.

చిన్నారిపై ఘాతుకానికి పాల్పడిన కులవర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతను తప్పించుకుని పారిపోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతని మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే, డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు తల్లితో పాటు బంధువులెవరూ ముందుకు రాలేదు. తమకు అతనితో ఎలాంటి సంబంధం లేదని సోదరి తేల్చి చెప్పింది. దీంతో అతని మృతదేహం ఆసుపత్రిలో అనాథలా పడి ఉంది.

చివరకు అతని పెదనాన్న ముందుకు వచ్చి సంతకం చేయడంతో, మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త తరలించే వాహనంలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు జరిపారు. 

కులవర్ధన్ మరణవార్త తెలియగానే మదనపల్లె వాసులు సంబరాలు చేసుకున్నారు. అత్యాచార నిందితుడికి సరైన శిక్ష పడిందని, న్యాయం జరిగిందంటూ బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


More Telugu News