యువతకు మృణాల్ ఠాకూర్ లవ్ సలహా

  • ప్రేమ విషయంలో యువత ఓపికగా ఉండాలన్న మృణాల్ ఠాకూర్
  • ప్రస్తుతం చిన్న గొడవలకే సంబంధాలను వదులుకుంటున్నారని ఆవేదన
  • ప్రేమపై నమ్మకం కోల్పోవద్దని, అది ఓ అందమైన అనుభూతి అని సూచన
  • ‘దో దీవానే షెహర్ మే’ చిత్ర ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఫిబ్రవరి 20న సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్‌ల సినిమా విడుదల
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్, ప్రేమ విషయంలో నేటి యువతకు ఓ ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ప్రేమను కాపాడుకోవాలంటే ఓపిక చాలా అవసరమని, దానిపై సులభంగా నమ్మకం కోల్పోవద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. "ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రేమలో ఓపిక తగ్గిపోతోంది. అందుకే చాలామంది ఒకరినొకరు తేలిగ్గా వదులుకుంటున్నారు. మా సినిమాలో పాత్రల మాదిరిగా పాతకాలపు మనస్తత్వం ఉంటే బాగుంటుంది. చిన్న గొడవ వస్తే చాలు, వెంటనే ఒకరినొకరు బ్లాక్ చేసేస్తున్నారు. మా దారులు వేరు, మేం ఒకరికొకరం సెట్ కాము అని తేలిగ్గా చెప్పేసి సంబంధాలను వదులుకుంటున్నారు" అని అన్నారు.

"ప్రతి యువతీ యువకుడు ప్రేమను నమ్మాలని కోరుకుంటున్నాను. దయచేసి ప్రేమపై నమ్మకం వదులుకోవద్దు. అది చాలా అందమైన, అద్భుతమైన అనుభూతి. సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తే, జీవితం సులభంగా మారుతుంది. అందుకే సరైన వ్యక్తి కోసం ఓపికగా ఎదురుచూడండి. అంతేకానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని యువతకు ఆమె సలహా ఇచ్చారు.

ఇక ‘దో దీవానే షెహర్ మే’ చిత్రంలో మృణాల్‌తో పాటు సిద్ధాంత్ చతుర్వేది, సందీపా ధర్, ఆయేషా రజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది.


More Telugu News