Bandi Sanjay: మంత్రుల అవినీతి, వారికి చెంచాగిరి చేస్తున్న ఐఏఎస్ అధికారుల జాబితా మా వద్ద ఉంది: బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, ఇంకా బయటకు తీస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రులు చేస్తున్న అవినీతి ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ మంత్రులకు కొందరు ఐఏఎస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులకు చెంచాగిరి చేస్తున్న అధికారులు వాళ్లు సంపాదించుకుంటూ, మంత్రులకు ఎలా కూడబెడుతున్నారో తమకు తెలుసని అన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెంప చెళ్లుమనిపించామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బరితెగించి అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. తన మిత్ర పక్షం మజ్లిస్ కోసమే హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి మూడు ముక్కలు చేశారని ఆరోపించారు.
Bandi Sanjay
Telangana Congress
Corruption
IAS Officers
BRS
Majlis Party
Municipal Elections

More Telugu News