Galgotias University: చైనా రోబోడాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏం చెప్పారంటే?

చైనా యూనిట్రీకి చెందిన రోబో డాగ్‌ను ఢిల్లీలో జరుగుతోన్న 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో ప్రదర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చైనా కంపెనీ తయారు చేసిన ఈ రోబో డాగ్‌ను తామే అభివృద్ధి చేసినట్లు గల్గోటియాస్ యూనివర్సిటీ పేర్కొన్నట్లుగా వార్తలు రావడంపై ఆ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు స్పందించారు. 

ఈ చైనీస్ ఏఐ ఆధారిత రోబో డాగ్‌ను తాము అభివృద్ధి చేసినట్లు ఎప్పుడూ చెప్పలేదని, సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరిగిందని ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నేహా సింగ్ మాట్లాడుతూ, రోబోకు సంబంధించిన ప్రత్యేకతలను వివరిస్తున్న క్రమంలో కొన్ని వ్యాఖ్యలను పొరపాటుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ విద్యార్థులు రోబోటిక్ సైన్స్ గురించి ఎలా అధ్యయనం చేస్తున్నారో, ఏం అభివద్ధి చేస్తున్నారో వివరించే క్రమంలో కొంత తప్పుడు సంకేతాలు వెళ్లాయని అన్నారు. తమ వ్యాఖ్యలను కొన్నింటిని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో తమ స్టాల్ వివాదానికి కారణం కావడం తమకు బాధగా ఉందని అన్నారు. పరిశోధన, అభ్యాస వ్యాయామంలో భాగంగా చైనాకు చెందిన ఈ రోబోను ఎక్స్‌పోకో తీసుకువచ్చినట్లు చెప్పారు. తమ విద్యార్థుల అధ్యయనం, పరిశోధన కోసం ఈ డాగ్ రోబోను తీసుకువచ్చామని అన్నారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు దేశాన్ని గర్వపడేలా చేసిందని, కానీ అనుకోకుండా ఈ వివాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే మా విశ్వవిద్యాలయం ఎన్నోసార్లు దేశం గర్వించేలా చేసిందని, ఈ ప్రభావం తమ యూనివర్సిటీపై ఉంటుందని తాము భావించడం లేదని నేహా సింగ్ అన్నారు. తాము చెప్పిన విషయాలు ప్రజల్లోకి తప్పుగా వెళ్లాయని స్పష్టంగా చెబుతున్నానని అన్నారు.

ఈ విషయంలో పొరపాటు జరిగినందుకు మరో ప్రొఫెసర్ ఐశ్వర్య శ్రీవాస్తవ విచారం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొని భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి తాము క్షమాపణ చెప్పడం లేదని, కానీ తప్పుడు సమాచారం బయటకు వెళ్లిందని అన్నారు. తమ విద్యార్థులు ఐవోఎస్ యాప్‌లను అభివృద్ధి చేశారని అన్నారు.
Galgotias University
China Robot Dog
AI Impact Summit
Neha Singh
Aishwarya Srivastava
Robot dog controversy

More Telugu News