రాజ్ పాల్ ఇంటి ముందు చిన్న పిల్లాడిలా ఏడ్చా.. ఫైనాన్షియర్ మాధవ్ గోపాల్

  • తీసుకున్న మొత్తం తిరిగివ్వాలని ఆయన ఇంటి చుట్టూ తిరిగానన్న వ్యాపారవేత్త
  • వాళ్లావిడ ప్రాధేయపడితే రూ.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు వెల్లడి
  • చెక్ బౌన్స్ కేసులో అసలు విషయాన్ని బయటపెట్టిన ఫైనాన్షియర్ 


చెక్ బౌన్స్ కేసులో జైలుపాలైన బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాత్కాలిక సర్దుబాటుగా ఫైనాన్షియర్ కు రూ.1.5 కోట్లు తిరిగి చెల్లించడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుపై రాజ్ పాల్ కు అప్పు ఇచ్చిన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, వ్యాపారవేత్త మాధవ్ గోపాల్ అగర్వాల్ తాజాగా స్పందించారు. రాజ్ పాల్ పై చెక్ బౌన్స్ కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందనే వివరాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రాజ్ పాల్ యాదవ్ దర్శకత్వంలో, ఆయన భార్య రాధా యాదవ్ నిర్మాతగా 2010లో ‘అతా పతా లాపతా’ సినిమాను తెరకెక్కించారు. డబ్బు సర్దుబాటు కాక ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో రాజ్ పాల్ యాదవ్ అప్పు కోసం తనను సంప్రదించగా.. సినిమాలకు ఫైనాన్స్ చేయబోనని తాను స్పష్టం చేశానని మాధవ్ గోపాల్ చెప్పారు.

రాధా యాదవ్ పదే పదే ప్రాధేయపడుతూ తనకు మెసేజ్ లు చేయడంతో వ్యక్తిగత పూచీకత్తుతో ఇతరుల వద్ద నుంచి రుణం తీసుకుని రూ.5 కోట్లు ఇచ్చానని చెప్పారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన సొమ్ము తిరిగివ్వాలనే నిబంధన విధించానని తెలిపారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో రాజ్ పాల్ తన అప్పు తీర్చలేదని వివరించారు.

అప్పు వసూలు చేసుకోవడానికి రాజ్ పాల్ యాదవ్ ఇంటికి ఎన్నోమార్లు తిరిగానని, కొన్నిసార్లు ఆయన ఇంటి ముందు నిలబడి చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో అప్పు వసూలు చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. కోర్టులో కూడా అప్పు చెల్లిస్తానని హామీ ఇచ్చి, ఆ మేరకు చెక్కులు రాసిచ్చాడని వివరించారు. రాజ్ పాల్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కేసు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.


More Telugu News