కిడ్నాప్ కేసు: మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

  • విద్యార్థుల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
  • ప్రధాన నిందితుడితో కాల్స్, మెసేజ్‌లపై ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని వెల్లడి
  • కేసు కొట్టివేత పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్‌ మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఫోరెన్సిక్ నివేదిక రానున్న నేపథ్యంలో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. కేసులో లోతైన విచారణ జరపాల్సి ఉందని పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని మోహన్‌బాబు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.

మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై తిరుచానూరు పోలీసులు ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మోహన్‌బాబును ఏ-2గా చేర్చారు.


More Telugu News