అందువల్లే డాక్టర్లకు అంత గౌరవం లభిస్తోంది: మంత్రి నారా లోకేశ్

  • మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం
  • వైద్యులకు దిశానిర్దేశం చేసిన మంత్రి లోకేశ్
  • వైద్య విద్య పూర్తికావడం నిరంతర అభ్యాసానికి లైసెన్స్ లాంటిదని వ్యాఖ్య
  • సాంకేతికత సాయం చేసినా, వైద్యుడి స్పర్శలోని స్వస్థత శక్తికి సాటిలేదన్న మంత్రి
సంపద లేదా హోదా వల్ల కాకుండా, జీవితానికి మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే వైద్యులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. లాభాపేక్షతో కాకుండా మానవత్వంతో సేవలందించాలని, రోగుల నమ్మకాన్ని కూడా తమ విధి నిర్వహణలో భాగంగా మార్చుకోవాలని ఆయన యువ వైద్యులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. అత్యవసర వార్డులోకి వచ్చే రోగి మీ కళ్లలోకి ఎంతో ఆర్తిగా చూస్తాడు. వారు మీ నుంచి కేవలం మందులనే కాదు, నమ్మకాన్ని, భరోసాను ఆశిస్తారు. మీరు ఇచ్చేది కేవలం ప్రిస్క్రిప్షన్ కాదు, వారిలో చిగురింపజేసే ఆశ. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైతే, ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలందించారు. అందుకే సమాజం మిమ్మల్ని దేవుడి తర్వాత అంతటి వారిగా చూస్తుంది" అని అన్నారు.

దినదినాభివృద్ధి చెందిన మంగళగిరి ఎయిమ్స్

ఈ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక కాదని, విద్యార్థులుగా ప్రవేశించి జీవన సంరక్షకులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న పరివర్తన అని లోకేశ్ అభివర్ణించారు. 

"ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎయిమ్స్ భావించబడుతోంది. 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్, నేడు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ కోర్సులతో 1,300 మందికి పైగా విద్యార్థులతో ఒక సమగ్ర సంస్థగా ఎదిగింది. కొన్ని పడకల నుంచి నేడు దాదాపు 650 పడకలకు విస్తరించింది. ఓపెన్-హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి, రోబోటిక్ మోకాళ్ల మార్పిడి వంటి అధునాతన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు స్తంభాలపై నిలిచి ఉంది. వీటికి 'నమ్మకం' అనే నాలుగో స్తంభాన్ని కూడా మీరు జోడించాలి" అని ఆయన సూచించారు.

ఇప్పటివరకు 45 లక్షలకు పైగా ల్యాబ్, డయాగ్నస్టిక్ సేవలు అందించడం సంస్థ విస్తరిస్తున్న ఆశలకు ప్రతీక అని కొనియాడారు.

మీరే ఈ దేశపు నిజమైన హీరోలు

యువ వైద్యులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, "మీరే ఈ దేశపు నిజమైన హీరోలు. సాంకేతికత ఎంత మారినా, కృత్రిమ మేధస్సు (ఏఐ) మీ నైపుణ్యానికి సహాయపడినా.. వైద్యుడి స్పర్శలోని స్వస్థత శక్తికి సాటిలేదు. ఒక్కోసారి మందుల కన్నా మీరిచ్చే భరోసాయే రోగాన్ని నయం చేస్తుంది. డబ్బు చెల్లించలేని రోగిని ఎలా చూస్తారు, నిరక్షరాస్యులకు ఎలా వివరిస్తారనే దానిపై మీ మానవత్వం ఆధారపడి ఉంటుంది" అని అన్నారు. వైద్యులకు వినయం గొప్ప లక్షణమని, గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

నైతికతను ఎన్నడూ మరువద్దు

"మీరు అందుకున్న పట్టా వైద్య విద్య పూర్తి చేసిన సర్టిఫికేట్ మాత్రమే కాదు, నిరంతరం నేర్చుకోవడానికి పొందిన లైసెన్స్. డాక్టర్ నేర్చుకోవడం ఆపివేసిన క్షణమే, రోగులు ఇబ్బంది పడతారు. లాభాపేక్షతో మందులు సూచించవద్దు, సౌకర్యం కోసం రాజీ పడవద్దు. మీ వృత్తి మీ హృదయంలోని మానవత్వాన్ని ప్రతిబింబించాలి. ఓటమిని విజయానికి సోపానంగా భావించి, కష్టాలను అధిగమించాలి. తెల్ల కోటు ధరించినప్పుడు దాని గౌరవాన్ని నిలబెడుతూ, రోగులపై ప్రేమతో ముందుకు సాగండి" అని మంత్రి లోకేశ్ ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షుడు మేజర్ జనరల్ డాక్టర్ తపన్ కుమార్ సాహా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అంతం శాంత సింగ్, అధ్యాపకులు, పట్టభద్రులైన వైద్యులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


More Telugu News