షోయబ్ అక్తర్ ‘యూ-టర్న్’: మొహ్సిన్ నఖ్వీ ‘మంచోడు’ అంటూ కితాబు

  • తాను మొహ్సిన్ నఖ్వీని విమర్శించలేదని, తన మాటలను వక్రీకరించారని ఆరోపణ
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమితో మొదలైన వివాదం
  • సూపర్-8 అవకాశాలు నిలవాలంటే నమీబియాపై పాక్ తప్పక గెలవాలి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు.

ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మాట్లాడిన అక్తర్.. "నేను మొహ్సిన్ నఖ్వీని అసమర్థుడని అనలేదు. అంతర్జాతీయ క్రికెట్‌ను నడిపిస్తున్న ఉన్నతాధికారుల గురించి ఆ మాట అన్నాను. మొహ్సిన్ భాయ్ చాలా మంచి వ్యక్తి, పాక్ క్రికెట్‌కు సేవ చేయాలని తపిస్తున్నాడు. కానీ ఆయన చుట్టూ ఉన్నవారు సరైన సలహాలు ఇవ్వడం లేదు" అని సర్దిచెప్పుకొచ్చాడు. 

15న కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో పాక్ జట్టు సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్ 8-1 ఆధిక్యంతో తిరుగులేని రికార్డును కొనసాగిస్తోంది. టోర్నీలో ముందడుగు వేయాలంటే పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.


More Telugu News