టాస్ దగ్గరే పాకిస్థాన్ ఓడిపోయిందన్న టీమిండియా స్పిన్ దిగ్గజం

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే పాక్ ఓటమికి కారణమన్న అశ్విన్
  • ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారత్ 100 రెట్లు మెరుగ్గా ఉందని వెల్లడి
  • పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా వ్యూహాత్మక తప్పిదాలు చేశాడని విమర్శలు
  • ఇషాన్ కిషన్ ఎదుట షహీన్ అఫ్రిదిని ప్రయోగించడం పెద్ద తప్పు అని విశ్లేషణ
2026 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించడంపై టీమిండియా మాజీ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన విశ్లేషణను పంచుకున్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోవడమే వారి ఓటమిని నిర్ణయించిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఛేజింగ్ చేయాలన్న నిర్ణయం దారుణంగా బెడిసికొట్టిందని అన్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్ 'యష్ కీ బాత్'లో మాట్లాడుతూ... ఈ టోర్నీలో ఛేజింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై పాక్ ఫీల్డింగ్ ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమని తెలిపాడు. "ప్రేమదాస స్టేడియంలో చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయడం అసాధ్యం. ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ 100 రెట్లు వెనుకబడి ఉంది. నిజాయతీగా చెప్పాలంటే వాళ్లు ఆ స్థాయిలో లేరు" అని అశ్విన్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా బౌలర్లను ఉపయోగించిన తీరును కూడా అశ్విన్ ప్రశ్నించాడు. ముఖ్యంగా, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ల బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ప్రమాదకరమని తెలిసినా... షహీన్ అఫ్రిదితో బౌలింగ్ చేయించడాన్ని తప్పుబట్టాడు. "డేటా నిజం చెబుతుంది. షహీన్ దెబ్బలు తింటున్నా, అతడితోనే బౌలింగ్ కొనసాగించడం పెద్ద తప్పిదం. కనీసం రౌండ్ ది వికెట్ వచ్చి బౌలింగ్ చేయాల్సింది. రెండో ఓవర్ సయీమ్ అయూబ్‌కు ఇచ్చి ఉండాల్సింది" అని అశ్విన్ వివరించాడు.

ఆట చివర్లోనూ పాకిస్థాన్ పట్టు సాధించలేకపోయిందని అశ్విన్ విమర్శించాడు. డెత్ ఓవర్లలో మళ్లీ షహీన్ అఫ్రిదిని తీసుకురావడంతో, భారత బ్యాటర్లు సులభంగా పరుగులు సాధించారని గుర్తుచేశాడు. "భారత్ స్కోరు 19 ఓవర్లకు 159గా ఉంది. ఆ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన అఫ్రిది చివరి ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు" అని తెలిపారు.

లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను భారత్ బుధవారం అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం సూపర్ 8 దశకు సన్నద్ధం కానుంది.


More Telugu News