TS EAPCET: టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. జోన్ల ఎంపికపై కీలక సూచన

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఉన్నత విద్యామండలి (TSCHE) తరఫున జేఎన్‌టీయూ హైదరాబాద్ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) జరగనున్నాయి.

దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా, పరీక్ష రాసేందుకు అనువైన జోన్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని, ఒకసారి ఎంచుకున్న తర్వాత జోన్‌ను మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కేవలం హైదరాబాద్‌లోని నాలుగో జోన్ (పశ్చిమ హైదరాబాద్) పరిధిలోని పరీక్షా కేంద్రాలనే కేటాయించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 పరీక్షా జోన్లు ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే నాలుగు జోన్లను ఏర్పాటు చేశారు.
TS EAPCET
EAPCET 2026
Telangana EAPCET
JNTU Hyderabad
Engineering Entrance Exam
Agriculture Entrance Exam
Pharmacy Entrance Exam
TSCHE
Telangana Education

More Telugu News