Salman Ali Agha: రేపు భారత్‌తో మ్యాచ్‌లో మా తురుపుముక్క అతడే: పాక్ కెప్టెన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లో నిలుస్తున్న స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను తమ జట్టు 'ట్రంప్ కార్డ్ (తురుపుముక్క)'గా అభివర్ణించాడు. ఉస్మాన్ బౌలింగ్ శైలిపై వస్తున్న విమర్శలను ఆయన గట్టిగా తిప్పికొట్టాడు.

శనివారం జరిగిన మీడియా సమావేశంలో సల్మాన్ మాట్లాడుతూ.. "ఉస్మాన్ తారిఖ్ మాకు చాలా ముఖ్యమైన బౌలర్. భారత్‌పై అతడే మా కీలక ఆటగాడు. అతని బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ ఇప్పటికే రెండుసార్లు క్లియర్ చేసింది. అయినా అతని యాక్షన్‌పై ఎందుకింత చర్చ జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇలాంటి విమర్శలను ఉస్మాన్ పట్టించుకోడు" అని స్పష్టం చేశాడు. బంతిని విడుదల చేయడానికి ముందు కాస్త ఆగి, ఆలస్యంగా వేసే ఉస్మాన్ బౌలింగ్ శైలిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఫామ్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "బాబర్ ఫామ్ మాకు ఆందోళన కలిగించడం లేదు. అతను పరుగులు చేస్తూనే ఉన్నాడు. రేపటి మ్యాచ్‌లో కూడా పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నాం. బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు చేయాలనుకోవడం లేదు" అని సల్మాన్ తెలిపాడు.

ప్రపంచకప్‌లలో భారత్‌తో తమ రికార్డు గురించి కూడా పాక్ కెప్టెన్ మాట్లాడాడు. "గత రికార్డులను మనం మార్చలేం. ప్రపంచకప్‌లలో భారత్‌పై మాకు మంచి రికార్డు లేదన్నది వాస్తవం. కానీ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం" అని అంగీకరించాడు. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ 8 సార్లు తలపడగా, టీమిండియా 7 సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది.
Salman Ali Agha
Usman Tariq
Pakistan Cricket
India vs Pakistan
T20 World Cup
Babar Azam
Pakistan Team
Cricket Match
ICC
Bowling Action

More Telugu News