డబ్బు పెద్ద జబ్బు.. వందల కోట్లు పోయినా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా: జగపతిబాబు

  • ఈ రోజుల్లో డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న జగపతిబాబు
  • డబ్బు కోసం స్నేహితులు, బంధువులను దూరం చేసుకుంటున్నారని విమర్శ
  • ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం మేలని వ్యాఖ్య

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హీరోగా, విలన్‌గా, ఎన్నో కీలక పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. సాధారణ జీవితాన్ని ఇష్టపడే ఆయన... తనది ఎన్నో ఎత్తులు, లోతులు చూసి మళ్లీ నిలబడిన జీవిత కథ అని చెబుతుంటారు. తాజాగా ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డబ్బు గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.


జగపతి బాబు మాట్లాడుతూ... మనం డబ్బు వెంట పరిగెత్తకూడదని, అదే మన దగ్గరికి వచ్చేలా ఉండాలని సూచించారు. డబ్బు కేవలం అవసరాలను తీర్చే సాధనమేనని, ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన తనకు దాని విలువ బాగా తెలుసని చెప్పారు. ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారని, ఇది సమాజానికి చాలా ప్రమాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.


డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు అని, దాని కోసం ప్రాణ స్నేహితులను, బంధువులను దూరం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాను వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన ఆస్తి అని తెలిపారు. డబ్బు కోసం అబద్ధాలు ఆడటం, వేషాలు వేయడం కంటే ఉన్నదానితో తృప్తిగా బతకడం మేలు అని జగపతి బాబు సందేశం ఇచ్చారు. 



More Telugu News