ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ

  • వివిధ విమానాశ్రయాల అభివృద్ధి పనులకు సంబంధించి చర్చ
  • మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడి
  • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన ముఖ్యమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల అభివద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఈ క్రమంలో తదుపరి పనులు చేపట్టాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి పాల్వంచలో స్థలం గుర్తించామని తెలిపారు. ఓఎల్ఎస్ సర్వే, ఫీజబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి, అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ముఖ్యమంత్రి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులతో భేటీ అయ్యారు. 


More Telugu News