బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన పూర్ణ

  • దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ
  • ఇప్పటికే ఒక బాబుకు జన్మనిచ్చిన వైనం
  • త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అందాల నటి

సినీ రంగంలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ (షామ్నా ఖాసిం) జీవితంలో ఇప్పుడు మరో సంతోషపు అధ్యాయం మొదలైంది. రెండోసారి తల్లిగా మారబోతున్న ఈ అందాల తార, తాజాగా సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుని ఆ మధుర క్షణాలను, బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన పూర్ణ, 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షాహిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే హమ్దాన్ అనే బాబు ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల జరిగిన సీమంతం వేడుకలో పూర్ణ లైట్ పింక్ కలర్ గౌనులో మెరిసిపోయింది. అయితే ఆ గౌనుకి ఒక అందమైన ప్రేమ కథ ఉంది. తన భర్త మొదటిసారి “ఐ లవ్ యూ” అని చెప్పిన రోజు అదే గౌనును బహుమతిగా ఇచ్చాడట. ఆ జ్ఞాపకాన్ని ఇన్నాళ్లూ అల్మరాలో దాచుకున్నానని, ఇప్పుడు తన మాతృత్వ వేడుకలో మళ్లీ ఆ గౌనును ధరించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చింది. “ఈ రోజు ఆ గౌను కూడా నా ఆనందంలో భాగమై నవ్వింది” అని చెప్పడం అభిమానులను హత్తుకుంది.


ఈ వేడుకను తన భర్త మరింత ప్రత్యేకంగా మార్చాడని పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది. తన జీవితంలో భర్త చూపుతున్న ప్రేమ, పిల్లల వల్ల కలిగే ఆనందం ఈ రోజును ఒక కలలా మార్చాయని పేర్కొంది. అలాగే తన డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న పిల్లల గురించి కూడా ప్రస్తావిస్తూ, వారి ఎదుగుదల తనకు గర్వకారణమని చెప్పింది. “వారి చిరునవ్వులు నా జీవితానికి వెలుగు” అంటూ ఆమె రాసిన మాటలు అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాయి.




More Telugu News