అమెరికాతో వాణిజ్య ఒప్పందం... వాణిజ్య శాఖ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

  • సున్నిత రంగాలపై ఎప్పుడూ స్పష్టమైన వైఖరితో ఉన్నామని వెల్లడి
  • అత్యంత కీలకమైన రంగాలను దృష్టిలో ఉంచుకొని చర్చలు జరిపామన్న వాణిజ్య శాఖ కార్యదర్శి
  • రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమలను రక్షించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి
వాణిజ్య ఒప్పందాలలో, సున్నిత రంగాలపై భారతదేశం ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరితో చర్చలు జరిపిందని, అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలోనూ వ్యవసాయం సహా కీలక రంగాల ప్రయోజనాలను కాపాడేలా ముందుకు వెళ్లామని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశానికి అత్యంత కీలకమైన రంగాలను దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన వైఖరితోనే వాణిజ్య చర్చలు జరిపినట్లు తెలిపారు. అన్ని ఒప్పందాల విషయంలో ఇలా స్పష్టమైన వైఖరితోనే ఉన్నామని అన్నారు. మన రైతులు, మత్స్యకారులు, పాడిపరిశ్రమ సహా ప్రభావితమవుతాయని భావించిన రంగాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని రక్షించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 

భారత్, అమెరికా ఉమ్మడి ప్రకటనను చట్టబద్ధమైన ఒప్పందంగా మార్చడానికి ఇరు దేశాలు పనిచేస్తున్నాయని, మార్చి నెలాఖరు నాటికి దీనిని ఖరారు చేసి సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒప్పందాలలో సున్నితమైన రంగాలకు రక్షణ కల్పించామని, అంతగా సున్నితం కానటువంటి రంగాల విషయంలో మాత్రం మన మార్కెట్‌ను తెరిచేందుకు సుంకాలను ఉపయోగించామని తెలిపారు. కీలకమైన మన ఉత్పత్తులు ఉన్న రంగాల్లో మాత్రం మార్కెట్ ఇవ్వలేమని అమెరికాకు స్పష్టం చేశామని అన్నారు.


More Telugu News