Telangana Municipal Elections: మున్సిపల్ పోరులో పలుచోట్ల ఉద్రిక్తతలు.. వీడియోలు ఇవిగో!

Telangana Municipal Elections Witness Tensions in Multiple Locations
  • మహబూబాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
  • నిజామాబాద్ లోని 19వ వార్డ్ లో టెన్షన్
  • సదాశివపేటలో ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర్థి
తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 116 స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ, పోలీసులు ఏర్పాట్లు చేయగా.. కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సదాశివపేటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఒక అభ్యర్థిని ఓ పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నిజామాబాద్ జిల్లాలో..
జిల్లా కేంద్రంలోని కోటగల్లీ 25వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. 19వ డివిజన్ లో బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎలా అనుమతించారంటూ పోలీసులను సూర్యనారాయణ నిలదీశారు. అదేసమయంలో కాంగ్రెస్ నేత నగేశ్ రెడ్డి అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. నగేశ్ రెడ్డి, సూర్యనారాయణ అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

బోధన్ లో..
బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. నిజామాబాద్ జిల్లాలోని రాకాసిపేట్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహబూబాబాద్ పట్టణంలో..
మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 నెంబరు పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది.

మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
Telangana Municipal Elections
Municipal Elections
Telangana Elections
Nizamabad
Mahabubabad
Medak
Sangareddy
Voting
Clashes

More Telugu News