కొడంగల్ లో ఓటేసిన సీఎం.. మధిరలో డిప్యూటీ సీఎం

  • మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
  • మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కేంద్రమంత్రి బండి సంజయ్, కామారెడ్డిలో షబ్బీర్ అలీ..
  • సాయంత్రం 5 గంటలకు ముగియనున్న పోలింగ్
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటు వేశారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని ఢిల్లీకి వెళతారని సమాచారం.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతి నగర్‎లోని ఎస్సార్ హై స్కూల్ కేంద్రంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని హైటెక్‌సిటీలో 227వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఓటు వేశారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.



More Telugu News