టీ20 ప్రపంచకప్: టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో ఓపెనర్ అభిషేక్ శర్మ

  •  పొట్టలో ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ
  • నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం
  • పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ దృష్ట్యా విశ్రాంతినిచ్చే యోచనలో మేనేజ్‌మెంట్
  • అభిషేక్ స్థానంలో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌కు దక్కనున్న ఛాన్స్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్‌ను సోమవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కారణంగా అతడు మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు. అభిషేక్ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ధ్రువీకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే నమీబియాతో మ్యాచ్‌లో అతడి లభ్యతపై తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు యాజమాన్యం వెల్లడించింది.

యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తీవ్ర జ్వరంతోనే బరిలోకి దిగి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. త్వరలో పాకిస్థాన్ (ఫిబ్రవరి 15), నెదర్లాండ్స్ (ఫిబ్రవరి 18) జట్లతో కీలక మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో, అభిషేక్ విషయంలో యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అభిషేక్ గైర్హాజరీతో సంజూ శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం కనిపించింది. బుధవారం సాయంత్రం జరిగే చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత తుది జట్టుపై స్పష్టత రానుంది.


More Telugu News