కొండాపూర్‌లో హైడ్రా కొరడా.. రూ.700 కోట్ల విలువైన భూమికి రక్షణ

  • జంగమోని కుంటను మాయం చేసిన కబ్జాదారుల యత్నం భగ్నం
  • 4 ఎకరాల చెరువును చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు యత్నం
  • కబ్జాదారులపై కేసులు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు
  • చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న హైడ్రా
హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్‌లో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. సుమారు రూ. 700 కోట్ల విలువైన 4 ఎకరాల 'జంగమోని కుంట' చెరువు భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడారు.

శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనగూడ మార్గంలో ఉన్న ఈ చెరువును కబ్జాదారులు పూర్తిగా మట్టితో నింపి చదును చేశారు. చెరువు ఆనవాళ్లు కూడా లేకుండా చేసి, దాన్ని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేశారు. ఇటీవల 'జంగమోని కుంట మాయం' అయిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. చెరువును కబ్జా చేసినట్లు నిర్ధారించుకున్న తర్వాత కఠిన చర్యలు చేపట్టారు. భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, చెరువును కాపాడేందుకు హైడ్రా ఆధ్వర్యంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.


More Telugu News