ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ

  • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు స‌మావేశం
  • పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అనుమతులపై ప్రధానంగా చర్చ
  • అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
  • పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు సాయం అందించాలని కోరిన సీఎం
  • ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై ఏపీ అభ్యంతరాలను వినిపించిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించారు. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో ఆయన సమావేశమై, రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు.

భేటీలో ప్రధానంగా రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకంగా ఉన్న "స్టాప్ వర్క్ ఆర్డర్‌"ను శాశ్వతంగా ఎత్తివేయాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అలాగే, భూసేకరణ, పునరావాసం వంటి పనులు చేపట్టాల్సిన ఫేజ్-IIకు అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం, గోదావరి వరద జలాలను రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు గురించి వివరించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారంపైనా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య ఉన్న వంశధార నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రైబ్యునల్ తుది నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించాలని, తద్వారా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. 

అలగే ఏపీ-తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, దీని పరిష్కారానికి తక్షణమే గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎగువ కృష్ణాపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదనపై ఏపీ అభ్యంతరాలను బలంగా వినిపించారు. డ్యామ్ ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఏపీకి నీటి ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.



More Telugu News